కనకధారా సోత్రం గురుంచి చిన్న విశ్లేషణ చేద్దాం. మంత్రశాస్త్రం ప్రకారం విష్ణువు మోక్షాన్ని ఈశ్వరుడు ఐశ్వర్యంను ఇస్తారు. లక్ష్మీదేవి ఐశ్వర్యం ఇస్తుందని కూడా చెబుతారు. ఆదిశంకరులు ఈశ్వరుని కాకుండా లక్ష్మిని ఎందుకు ప్రార్ధించారు. ఈశ్వరుని బోళాశంకరుడు అని పొగిడితే కోరిన కోర్కెలు తీరుస్తాడు అని అంటారు కదా. అలా పలికే శంకరుని కాకుండా లక్ష్మిని ఎందుకు ప్రార్ధన చేసారు? చూద్దాం. ఐశ్వర్యం అంటే డబ్బు, బంగారం, భూమి ఇలాంటివి. మహాయోగి అయిన శంకరుడు వీటితోబాటుగా మోక్షంకూడా ఇస్తాడు. అయితే ఈశ్వరానుగ్రహం పొందాలంటే చాలా తపస్సు చేయాలి. దరిద్రుడు, కష్టాల్లో ఉన్నవాడు తపస్సు , మంత్రసాధన ఎలా చేస్తాడు. మనస్సు లగ్నం కాదు. కర్మబంధాల్లో ఉన్నవాడు వాటినుంచి బయటపడడం అంతసులభం కాదు. పూర్వజన్మల్లోని కర్మల మూలంగా మనం బాధలు పడుతోంటే తపస్సు, మంత్రం సాధన, మీద లగ్నంకాదు. మొట్టమొదట జీవనపోరాటం నుంచి విముక్తుడు కావాలి. ప్రొద్దున్న లేచినప్పటినుంచి ఆహారంకోసం వెంపర్లాడేవాడిని జపం చేయమంటే చేయలేడుకదా.
ఇక్కడే ఆదిశంకరుల దూరదృష్టిని ఆలోచనాశక్తి ని గుర్తించాలి. కర్మలనుంచి విముక్తుడు అవ్వాలంటే పూజ, జపం,ధ్యానం, దానంలాంటివి చేయాలి. అలా చేయాలంటే డబ్బు కావాలి. ఆపదలో ఉన్న గజేంద్రుడిని కాపాడడానికి పరుగున వచ్చిన సకల లోకాలను కాపాడే స్థితి కారకుడు అయిన శ్రీమహావిష్ణువు వక్షస్థలనివాసిని అయిన లక్ష్మి (వ్యూహలక్ష్మి) ని ఆదిశంకరులు కనకధార స్తోత్రంలో “అశేష లోకాదినాధగృహిణీం అమృతాబ్ధిపుత్రీం “ అని స్తుతించారు. లక్ష్మీదేవిని శుభ కర్మలు చేయించేది గాను ,భ్రుగుపుత్రి, సోముడు ( చంద్రుడు) అమృతం నకు సోదరిగానూ, భూమండల నాయకి గానూ, శ్రీమహావిష్ణువుభార్యగానూ అనేక రకాలుగా స్తోత్రం చేసారు.ప్రత్యక్షంగా లక్ష్మిని పరోక్షంగా మిగిలిన వారినీ స్మరణ చేయడం మూలంగా అందరి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ కనకధారా స్తోత్రం పారాయణ చేసినంతనే ఆ మహాలక్ష్మి కృపకు పాత్రులు అవుతారు. కలియుగంలో కస్టాలు తొలగడానికి వేదవ్యాసమహాముని చేసినంత కృషినీ ఆదిశంకరులు చేసారని చెప్పవచ్చు. మరొకసారి ఆదిశంకరుల చేసిన స్తోత్రాల్లోని రహస్యాలని చర్చిద్దాం.
Add new comment