వరలక్ష్మి మంటపారాధన విధానం
ముందుగా గణపతి పూజ చేసి పుణ్యాహవాచనం చేసుకోవాలి. మరల సంకల్పం చేసికొని ముందుగా మంటపంలో కలశం పెట్టుకొని వరుణుని ఆవాహన చేసుకోవాలి. వరుణునికి షోడశ లేదా పంచ ఉపచారాలతో పూజచేసి తరువాత అష్టమాతృకలని అవాహన చేయాలి. తరువాత
"ఓం శ్రీం హ్రీం ఐం శ్రీలక్ష్మీ కమలధారిణ్యై సింహవాహన్యై స్వాహా"
అనే మంత్రంతో సింహవాహిని వరలక్ష్మి పరదేవతాయైనమః అని ఆవాహన చేసుకోవాలి.
అష్టమాతృకలకి విడిగా ప్రాణప్రతిష్ఠ, పూజవిడిగా చెయ్యాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా క్రొత్త లక్ష్మీరూపుకి పంచామృతాలతో అభిషేకం చేసి మంటపంలో ఉంచాలి. తరువాత కలశం మీద చేయి ఉంచి శ్రీసూక్తం, దుర్గ సూక్తం పఠించాలి. వరలక్ష్మికి "అసునీతే........." అనే మంత్రం మూడుసార్లు చెప్పి ప్రాణప్రతిష్ఠ చేయాలి. తరువాత శ్రీసూక్త విధానంలో పూజ చేసుకోవాలి. పూజ సమయంలో లక్ష్మీసహస్రం చేసుకుంటే మంచిది. లక్ష్మిసహశ్రం అలవాటు లేకపోతే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు 11 సార్లు చెప్పాలి. ఇంట్లో చేసిన బియ్యంపరమాన్నం (సేమ్యాతో చేయకూడదు)నైవేద్యం చెయ్యాలి. వీలయితే పాలకోవా, కలకండ చేసి నైవేద్యం చెయ్యాలి. పూజ అయిన వెంటనే కలశానికి ఉద్వాసన చెప్పకూడదు. సాయంత్రం కూడా పూజ చెయలి. మరుసటి రోజు శనివారం ఉదయం 08.00 గం. తరువాత మంటపానికి మరల పూజచేసి ఉద్వాసన చెప్పాలి. కొన్ని సంప్రదాయాల్లో లక్ష్మీదేవికి ఉద్వాసన చెప్పరు. “ ఓం” అని కలశం తీసివేస్తారు. కలశం క్రింద వేసిన బియ్యం మనం అన్నం వండుకుని తింటే మంచిది.
పూజకు కూర్చోవడానికి ప్లాస్టిక్ చాప కాకుండా దర్భాసనం లేదా కొత్త వస్త్రం వాడితే మంచిది
ఓం తత్సత్.
Add new comment